ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు | INDIA parties clinch 10 assembly bypoll seats | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు

Jul 14 2024 4:53 AM | Updated on Jul 14 2024 4:53 AM

INDIA parties clinch 10 assembly bypoll seats

10 స్థానాల్లో గెలుపు 

 బీజేపీకి రెండు.. స్వతంత్రులు 1 

న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్‌లోని నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది.  

అసెంబ్లీలో భార్యాభర్తలు 
హిమాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సతీమణి కమలేష్‌ ఠాకూర్‌ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్‌ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. 

తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్‌ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్‌ బలం మళ్లీ 40కి చేరింది. 

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం.

Advertisement
 
Advertisement
Advertisement