భారత్లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..
అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..
1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులు
భారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.
2. మౌలిక సదుపాయాల అడ్డంకులు
దేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి
3. స్థిరత్వం, కార్బన్ నియమాలు
2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
4. సైబర్ భద్రతా ప్రమాదాలు
ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.
5. పైలట్ల కొరత..
దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.
పరిష్కారాలు..
దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడం
పైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడం
FDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం.
పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లు
పైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
ఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడం
వాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్లు ఏర్పాటు చేయడం
ప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్లు తీసుకురావాలి.
విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం.
ఎయిర్లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి.
చిన్న ఎయిర్లైన్స్కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్వే ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలి.
మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలి.
కార్గో టెర్మినల్లను ఆధునీకరించాలి.
ఎయిర్పోర్ట్లలో సోలార్ ఎనర్జీ వినియోగం.
ఎఫ్డీటీఎల్ నిబంధనలు..
డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే.
పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.
రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.
‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు.
పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి.
విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.
ఇండిగో ఏం చేసింది..
మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమగ్ర సంస్కరణలు అవసరం..
భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది.


