దేశీ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఊరటనిచ్చింది. మార్కెట్పై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ వాటిపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసింది. రెండు సంస్థలు పోటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కాలేదని పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే, ఈ కంపెనీలు చట్టవిరుద్ధంగా భారీ స్థాయిలో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఏకపక్ష నిబంధనలను కస్టమర్లపై రుద్దుతున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. అయితే, టికెట్ల రిఫండ్లకి ఎయిర్లైన్స్లో నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉన్నందున, అలాగే క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద మొత్తంలో రిఫండ్ వచ్చేలా బుక్ చేసుకునే వీలు కూడా ఉన్నందున గుత్తాధిపత్య దురి్వనియోగం ఆరోపణలపై తదుపరి విచారణ అవసరం లేదని సీసీఐ పేర్కొంది.
రిఫండ్, క్యాన్సిలేషన్ నిబంధనలను కంపెనీలు ముందుగానే ప్యాసింజర్లకు తెలియజేస్తాయని తెలిపింది. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వాటిని అమలు చేస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు సీసీఐ అభిప్రాయపడింది. అటు 2025 డిసెంబర్లో ఇండిగో పెద్ద ఎత్తున ఫ్లయిట్లను రద్దు చేయడంపై దాఖలైన కేసుతో కలిపి ఈ కేసును కూడా విచారణ చేయాలన్న మరో పిటీషన్ని తోసిపుచ్చింది. రెండూ వేర్వేరు అంశాలు కాబట్టి కలిపి విచారణ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగోకి 65 శాతం, ఎయిరిండియాకి 27 శాతం వాటా ఉన్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా?


