సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిరాభివృద్ధి | India can become global hub of green hydrogen says pm narendra modi | Sakshi
Sakshi News home page

సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిరాభివృద్ధి

Mar 5 2022 5:17 AM | Updated on Mar 5 2022 5:17 AM

India can become global hub of green hydrogen says pm narendra modi - Sakshi

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులు తగినంతగా ఉన్న భారత్, హరిత హైడ్రోజన్‌కు ప్రపంచ హబ్‌గా మారగలదని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ఇంధన వనరులతో మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నామన్నారు. ‘సుస్థిరాభివృద్ధికి ఇంధనం’అంశంపై శుక్రవారం జరిగిన  వెబినార్‌లో ప్రధాని మాట్లాడారు. హైడ్రోజన్‌ పర్యావరణ వ్యవస్థ ఎరువులు, శుద్ధి కర్మాగారాలు, రవాణా రంగంతో సంబంధం కలిగి ఉందన్నారు. ఇందులోకి ప్రవేశించే ప్రైవేట్‌ రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు.

సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు లక్ష్యాలను విధించుకుందన్నారు. 2070 నాటికి ఉదార్గాలను సున్నా స్థాయికి తీసుకురావడం, 2030 నాటికి మృత్తికేతర విద్యుత్‌ సామర్థ్యాన్ని 500 గిగావాట్లు సాధించడం, మన విద్యుత్‌ ఉత్పత్తిలో సగం మృత్తికేతర వనరుల ద్వారా పొందడం లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమయ్యే మాడ్యూళ్ల తయారీకి బడ్జెట్‌లో రూ.19,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇధనాల్‌ ఉత్పత్తిని పెంచేందుకు చక్కెర మిల్లులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను మనం అవకాశాలు మార్చుకుంటున్నామని పేర్కొన్నారు.  వెబినార్‌లో విదేశాంగ, పెట్రోలియం, సహజవాయువు, పర్యావరణ శాఖల మంత్రులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement