ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్ మథురై బాబాగా పేరొందిన అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణ్ దాస్ (29) గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో 29 ఏళ్ల స్వీయ-ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ యువతులను లైంగికంగ దోచుకోవడం, వారిని, వారి కుటుంబాలను బ్లాక్మెయిల్ చేయడం లాంటి ఆరోపణలతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు.
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి విద్యావంతులైన యువతులను లైంగికంగా దోపిడీ చేస్తున్న ఆరోపణలపై మిశ్రాను సోమవారం రాధా కుండ్లోని అతని ఆశ్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంగణం నుంచి ఇద్దరు యువతులను, ఒక యువకుడిని కూడా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు.
మే 25న ఛత్తీస్గఢ్కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిశ్రా తనకు 'ప్రసాదం' అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు కలిగించే పదార్థం ఉందని నర్సింగ్ విద్యార్థిని ఆరోపించింది. పాలు తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈమె ఫిర్యాదు మేకు కేసు నమోదైంది.
ఇదీ చదవండి: విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్ న్యూస్: కేబినెట్ కీలక నిర్ణయం
డీఎస్పీ అనిల్ కుమార్ సింగ్ సమాచారం ప్రకారం నిందితుడు బాధితురాలిని బెదిరించి, డబ్బు చెల్లించకపోతే ఆమె వీడియోలను ప్రచారం చేస్తానని హెచ్చరిస్తూ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. దర్యాప్తులో భాగంగా, నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు వివిధ పురుషులు, మహిళలకు చెందిన డజనుకు పైగా అశ్లీల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. మిశ్రా ఆన్లైన్లో ప్రసంగాలతో అనుచరులను ఆకర్షించేవాడని, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
గత నాలుగేళ్లుగా అభిషేక్ మిశ్రా మథురలోని రాధాకుంజ్ ప్రాంతంలో నివసిస్తూ, తనను తాను ఒక 'కథావాచక్' (ఆధ్యాత్మిక ప్రవచనకారుడు) గా పరిచయం చేసుకున్నాడు. యూట్యూబ్లో "రాధా కృప అమృత" (Radha Kripa Amrita) అనే ఛానెల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు చెబుతూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా విద్యావంతులైన మహిళలను, ముఖ్యంగా ఇంజనీర్లు, పెద్ద కంపెనీలలో పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారిని లైంగికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితుడిని జైలుకు తరలించామని ఎస్పీ (గ్రామీణ) సురేష్ చంద్ర రావత్ తెలిపారు. మిశ్రా నేపథ్యం, బాధితులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి
విచారణ సమయంలో మిశ్రా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అతను సుమారు ఐదేళ్ల క్రితం ఐఐటి రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. మధురకు వెళ్లడానికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి రూ. 20 లక్షల జీతంతో పనిచేశాడు.
ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్


