సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాదం జరిగిన ప్రతిసారీ పునరావృతమయ్యే విషాద గాథ ఇదే. అంతులేని నిర్లక్ష్యం, నిబంధనలను తుంగలో తొక్కే అధికారుల అవినీతి, అధికారిక పర్యవేక్షణ లోపం వెరసి అమాయక ప్రజల ప్రాణాలు. ఢిల్లీలోని ఒక హెటల్లో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఈ విషయాలనే మరోసారి తేటతెల్లం చేస్తోంది.
బుధవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువమంది వైద్య కోసం వచ్చిన విదేశీయులు ఉండటం మరో విషాదం. అయితే ఈ హోటల్కు అనుమతికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం, ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్మెంట్లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది.
మరోవైపు ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ హోటల్కు ఎంట్రీ, ఎగ్జిట్కు ఒకే దారి ఉంది. ఈ హోటల్లో 25 గదులు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది అతిథులు బస చేస్తుండటం గమనిస్తే, ఇది మరో నిబంధనల ఉల్లంఘనే. హోటల్కు అవసరమైన అగ్నిమాపక భద్రతా అనుమతులున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి
కాగా ఐదంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మికాసా ఇన్ హోటల్ను కూడా ప్రభావితం చేశాయి. దట్టమైన పొగ, మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో, డజన్ల కొద్దీ అతిథులు లోపల చిక్కుకుపోయారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాటర్ ఇంజన్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక క్విక్-రెస్పాన్స్ వాహనం, ఇతర అత్యవసర వనరులతో సహా పలు అగ్నిమాపక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, 40 మందికి పైగా ప్రజలను రక్షించారు. సంఘటన జరిగిన సమయంలో అందులో దాదాపు 40 మంది అతిథులు బస చేస్తున్నారని అధికారులు తెలిపారు. సమీపంలో మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది అతిథులు ఈ హోటల్నే ఎంచుకుంటారు.
ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్


