
నేడు ఢిల్లీలో కాంగ్రెస్, ఆర్జేడీ కీలక భేటీ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధికార ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన నేపథ్యంలో విపక్ష ‘మహాఘట్బంధన్’ కూటమి పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్, ఆర్జేడీ ముఖ్య నేతల మధ్య కీలక భేటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే సీట్ల పంపకాన్ని ఖరారుచేసి ఈ వారంలోనే సంయుక్త మేనిఫెస్టోను ప్రకటించాలని విపక్ష కూటమి భావిస్తోంది.
నేడు జరగబోయే సమావేశం కోసం ఇప్పటికే ఆర్జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్లు ఢిల్లీకి చేరుకున్నారు. భేటీ కోసం వచ్చానని లాలూ చెప్పగా కోర్టు కేసు కోసం వచ్చానని తేజస్వీ ఎయిర్పోర్ట్లో మీడియాతో చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తక్కువ సీట్లనే కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆనాడు 70 చోట్ల పోటీచేసి 17 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెల్చిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ గౌరవప్రదమైన ఆమోదనీయమైన స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు.