కువైట్ ఎయిర్పోర్ట్పై దాడి ఘటనతో 55 ఏళ్ల భారతీయుని ఇంట్లో విషాదం
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్పోర్ట్లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్పోర్ట్కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్పోర్ట్పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్కాల్ వచ్చింది.
మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు.
నేడు భారత్కు మన్జూర్ పార్థివదేహం
విమానంలో కువైట్ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు.


