కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..! | Elderly Man Found Sitting Next To Son Body For 4 Days In Mohali | Sakshi
Sakshi News home page

కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. ఇంట్లోంచి దుర్వాసన రావటంతో..!

Aug 30 2022 9:17 PM | Updated on Aug 30 2022 9:17 PM

Elderly Man Found Sitting Next To Son Body For 4 Days In Mohali - Sakshi

అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు.

చండీగఢ్‌: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు.

‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్‌ చంద్‌ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. 

మృతి చెందిన సుఖ్విందర్‌ సింగ్‌ అనే వ్యక్తి బల్వాంత్‌ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు.

ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..

Advertisement
 
Advertisement
Advertisement