ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం | Delhi Dust Storm Effect 205 Flights Delayed | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం

Apr 12 2025 10:52 AM | Updated on Apr 12 2025 12:38 PM

Delhi Dust Storm Effect 205 Flights Delayed

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్‌ స్టేడియంలో ముంబై టీమ్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈ తుపాన్‌ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్‌ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.

ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్‌ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్‌ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement