
ఈసీ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లఘించే రాజకీయ పార్టీలపై చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని మరో 26 పార్టీలు కూడా ఉన్నాయి. తొలి జాబితాలో 334పార్టీలను రద్దు చేసిన ఈసీ తాజాగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రెండో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఇందులో ఏపీలోని 17, తెలంగాణలోని 9 పార్టీలు ఉన్నాయని పేర్కొంది.
2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే ప్రధానమైన షరతును నెరవేర్చడంలో విఫలమైన రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీల(ఆర్యూపీపీ)ను గుర్తించేందుకు, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఎన్నికల వ్యవస్థను స్వచ్ఛంగా మార్చేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఈసీ పేర్కొంది.
కాగా, జాబితా నుంచి తొలగించిన (డీలిస్ట్)పార్టీలు ఏవీ కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29సీ, 29బీ ఆదాయపన్ను చట్టం–1961, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్ అండ్ ఎలాట్మెంట్) ఆర్డర్ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఇటీవల తొలి జాబితా విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.