
జీవితం చీకటి అయిపోయింది. ఇంకా ఎవరి కోసం బతకాలి..
భోపాల్: ఏప్రిల్ 26వ తేదీ బుధవారం ఛత్తీస్గఢ్ దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దుశ్చర్య.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యాభై కేజీల మందుపాతరతో పది మంది డీఆర్జీ జవాన్లు, ఓ డ్రైవర్ బలిగొన్నారు మావోయిస్టులు. ఈ ఘటనలో అమరలైన జవాన్లకు ప్రభుత్వం తరపున గౌరవవందనం అందగా.. అనంతరం అయినవాళ్ల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అయితే.. దంతేవాడ మావోయిస్టుల దాడిలో అమరుడైన డీఆర్జీ జవాన్ భార్య.. ఆత్మాహుతికి సిద్ధపడింది. భర్తతో పాటే తననూ చితి మీద కాల్చేయండంటూ గ్రామస్తులను, బంధువులను బతిమాలుకుందామె. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టింది. చివరికి ఆమెను అంతా బలవంతంగా చితిపై నుంచి బయటకు లాక్కొచ్చారు. భర్త మరణంతో తన బతుకు చీకట్లోకి కూరుకుపోయిందని, ఇంక తాను ఎవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోందామె.
అమర జవాన్ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. షాహీద్ జవాన్.. అమర్ రహే అంటూ కన్నీటి నినాదాలతో అంతిమ యాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణం పొగొట్టుకున్నందుకు నివాళి.. ఊరంతా లఖ్మూ మృతదేహాన్ని తాకి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: జనజీవన స్రవంతిలో కలిసి.. ఇప్పుడు బలైపోయారు!