వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త! | Cyber fraudsters use US visa policy change to con applicants | Sakshi
Sakshi News home page

వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త!

Jun 7 2025 5:40 AM | Updated on Jun 7 2025 6:59 AM

Cyber fraudsters use US visa policy change to con applicants

అమెరికా ఎంబసీ హెచ్చరిక

బెంగళూరులో బయటపడ్డ వీసా స్కామ్‌

న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వీసా దరఖాస్తుదారులను ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల మారిన నిబంధనలను ఆసరాగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రయతి్నస్తున్నారంటూ ఓ ప్రకటనలో అలర్ట్‌ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్‌ను సైబర్‌ నేరగాడు బీ1/బీ2 నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా ఇంటర్వ్యూ ముందుగానే ఇప్పిస్తామని మోసం చేశారని వివరించింది. అమెరికా వీసా దరఖాస్తు పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలను, అర్హతలను షేర్‌ చేయవద్దంటూ శుక్రవారం అమెరికా ఎంబసీ ‘ఎక్స్‌’లో కోరింది. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగానే వచ్చేందుకు ఎక్కువ ప్రాసెస్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అది వట్టి మోసమని వెల్లడించింది. 

ఇంజినీర్‌ ఎలా మోసపోయారంటే.. 
బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన ఇంజినీర్‌(45) అమెరికా సందర్శనకు అవసరమైన బీ1/బీ2 నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ఇంటర్వ్యూ షెడ్యూల్‌ 2026 మార్చిలో ఖరారైంది. టెలీగ్రామ్‌ యాప్‌లో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆయన.. ఓ వ్యక్తిని మే 22న సంప్రదించాడు. ఆ మోసగాడు తన పేరు వనం శ్రవణ్‌ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగా రావాలంటే అడ్వాన్స్‌గా రూ.10వేలు చెల్లించాలన్నాడు.

 ఆ మేరకు డబ్బు పంపగా, వ్యక్తిగత వివరాలు కావాలడిగాడు. అమెరికా వీసా అప్లికేషన్‌ పోర్టల్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ కూడా తీసుకున్నాడు. ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ పత్రం పంపించిన మోసగాడు...మరో రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే లాగిన్‌ పాస్‌వర్డును మారుస్తానని బెదిరించాడు. ఆ మేరకు రూ.10వేలు చెల్లించిన తర్వాత కూడా ఆ మోసగాడు లాగిన్‌ పాస్‌వర్డును మార్చేశాడు. దీంతో, బాధితుడు చేసేదిలేక మే 24న పోలీసులను ఆశ్రయించాడు.

అవకాశం కోల్పోయిన బాధితుడు 
ఈ విషయంలో బాధితుడికి అమెరికా ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందదని సీనియర్‌ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ తొందరగా వచ్చేందుకు తనంతట తానే థర్డ్‌ పార్టీని ఆశ్రయించాడని, అధికారిక ప్రక్రియను కాదని దొడ్డిదారిన పని పూర్తి చేసుకునే ఇటువంటి వారిని ఎంబసీ అధికారులు ప్రోత్సహించరన్నారు. వ్యక్తిగత వివరాలతోపాటు పాస్‌వర్డ్‌ సైతం మోసగాడికి ఇవ్వడం మరీ దారుణమన్నారు. బాధితుడు మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

 ఇలా ఉండగా, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలతోపాటు విజిటర్‌ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం గత నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులందరి సోషల్‌ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలంటూ విదేశాంగ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, నాన్‌ ఇమిగ్రాంట్‌ వీసా దరఖాస్తుదారుల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజుగా ఇకపై వెయ్యి డాలర్లు వసూలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో వీసా ఇంటర్వ్యూలు తొందరగా పూర్తవ్వాలని కోరుకునే పర్యాటక వీసా దరఖాస్తు దారులు సైతం ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement