హామీలు తప్ప అమలేదీ?  | Congress slams Centre with promise versus reality Of Narendra Modi 3. 0 | Sakshi
Sakshi News home page

హామీలు తప్ప అమలేదీ? 

Jun 10 2026 5:15 AM | Updated on Jun 10 2026 6:31 AM

Congress slams Centre with promise versus reality Of Narendra Modi 3. 0

మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై కాంగ్రెస్‌ ఆగ్రహం 

న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మోదీ సర్కార్‌ 3.0కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ‘హామీ వర్సెస్‌ వాస్తవం’ పేరిట మంగళవారం ఒక డాక్యుమెంట్‌ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి గత 12 ఏళ్లుగా అనేక హామీలు, భారీ ప్రకటనలు, గొప్ప మాటలు, వార్తా శీర్షికలు వెలువడినప్పటికీ వాస్తవానికి ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేలా వాటిలో ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. 

ఏఐసీసీ రీసెర్చ్‌ డిపార్టుమెంట్‌ రూపొందించిన ఈ 75 పేజీల పత్రాన్ని కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ గౌడ, అమితాబ్‌ దూబే విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విదేశాంగ విధానం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, సామాజిక రంగం, పౌర స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, చట్టాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

 ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని 4 సిలిండర్లకు కుదించారని మండిపడ్డారు. మహిళలను, వారి కుటుంబాలను దగా చేశారని ఆరోపించారు. భారత్‌ను ప్రపంచ ఉపాధి కల్పన కేంద్రంగా మారుస్తామంటూ వాగ్దానం చేశారని తెలిపారు. వాస్తవానికి ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. పట్టణ ప్రాంత యువతలో నిరుద్యోగిత రేటు 18.4 శాతంగా ఉందన్నారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లలో 7 శాతం మంది మాత్రమే ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగాన్ని పొందుతున్నారని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement