
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజల కోసం కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. ఈ సందర్బంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత రేషన్ కిట్ గ్యారెంటీలను కాంగ్రెస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గ్యారంటీల పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల అప్పులు మాఫీ చేశాం. 21వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇది మా నిబద్దతను తెలియచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలు ఇస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక ఈ స్థాయిలో ఎవరూ రుణమాఫీ చేయలేదు. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాం.
#WATCH | Delhi: If voted to power in #DelhiElections2025, Congress announces to provide LPG cylinders at Rs 500, free ration kits and 300 units of free electricity
(Source: Congress) pic.twitter.com/SK4HsNnCAk— ANI (@ANI) January 16, 2025
దేశంలో నిరుద్యోగం సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది. అమలు చేసిందా?. 11 ఏళ్లుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూడండి. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. ఇచ్చారా?. 11 ఏళ్లలో మోదీ ఇచ్చింది కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ఢిల్లీలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు నాది బాధ్యత. కాలుష్యంతో ఢిల్లీ నివాసయోగ్యం కాకుండా చేశారు. ఢిల్లీ రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఢిల్లీకి వస్తే జ్వరాలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేజ్రీవాల్, మోదీ ఇద్దరు ఢిల్లీలో విఫలమయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

లిక్కర్ స్కామ్లో పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించాం. లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న ఆప్ను కూడా ఢిల్లీలో ఓడిస్తాం. దావోస్కు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం. పర్యటన ముగిసిన తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చాయో చెబుతాం. అవినీతిని కట్టడి చేస్తే గ్యారంటీలు అమలు చేయవచ్చు. 16లక్షల కోట్ల రూపాయలు అప్పులను కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోదీ మాఫీ చేశారు. మోదీ, కేజ్రీవాల్ కుర్చీ కొట్లాట వల్ల ఢిల్లీ ప్రజల వల్ల నష్టపోతున్నారు. తెలంగాణలో ఒకటిన్నర శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్కు 40 శాతం ఓట్లు తెచ్చాం. అధికారంలోకి వచ్చాం. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.