ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం!

CM Stalin Says Tamil Nadu Not To Implement EWS Quota - Sakshi

తమిళనాడులో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు చోటు లేదు 

అఖిల పక్ష సమావేశంలో నేతల తీర్మానం 

సుప్రీంకోర్టులో పునఃసమీక్ష పిటిషన్‌ దాఖలు చేయలని నిర్ణయం 

సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టీకరణ 

అన్నాడీఎంకే, బీజేపీ దూరం  

సాక్షి, చెన్నై: ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరిలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పునఃసమీక్ష పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని  సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు.

వివరాల ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలకు బలాన్ని కలిగించే విధంగా సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డీఎంకేతో పాటు కొన్ని పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ తీర్పుపై చర్చించి తదుపరి చర్యలకు అఖిల పక్ష సమావేశానికి సీఎం స్టాలిన్‌ నిర్ణయించారు. 

అఖిల పక్షం సమావేశంలో సుదీర్ఘ చర్చ 
డీఎంకే ప్రభుత్వ పిలుపునకు ఆ పార్టీ మిత్రపక్షాలు కదిలాయి. అసెంబ్లీలోని 13 పారీ్టల ప్రతినిధులకు ఆహా్వనం పంపించగా, అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సచివాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, ఎమ్మెల్యే హసన్‌ మౌలానా, ఎండీఎంకే నేత, ఎంపీ వైగో, సదన్‌ తిరుమలైకుమార్, వీసీకే నేతలు, ఎంపీలు తిరుమావళన్, రవికుమార్‌ సీపీఐ నేత ముత్తరసన్, తమిళర్‌ వాల్వురిమై కట్చి నేత వేల్‌ మురుగన్, కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి నేతలు చిన్న రాజ్, సూర్యమూర్తి, పురట్చి భారతం కట్టి నేత జగన్‌ మూర్తి, మనిద నేయ మక్కల్‌ కట్చి నేత జవహరుల్లా, డీఎంకే తరపున మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, రఘుపతి, సీఎస్‌ ఇరై అన్భు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పారీ్టలు తమ తమ అభిప్రాయా లను వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. 

తీర్మానాలు.. 
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను మంత్రి పొన్ముడి మీడియాకు వివరించారు. వెనుకబడిన తదితర సామాజిక వర్గాలకు తమిళనాట కేటాయిస్తున్న 69 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్రం పేర్కొంటున్న 10 శాతం రిజర్వేషన్‌ తమిళనాటు అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయా పారీ్టల ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేశామని తెలిపారు. జాతీయస్థాయిలో కొన్ని పారీ్టలు 10 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చి ఉన్నా, అదే పార్టీలు తమిళనాడులో మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడుతామని ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు.

సుప్రీంకోర్టు తీర్పుపై పునః సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయనున్నామని, బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచుతామని వివరించారు. గతంలో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. తమిళనాడులో సామాజిక న్యాయమే లక్ష్యమని,  10 శాతం రిజర్వేషన్లకు ఇక్కడే చోటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా సామాజిక న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావే శంలో సీఎం స్టాలిన్‌ ప్రకటించడం గమనార్హం.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top