
న్యూఢిల్లీ, సాక్షి: భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. తద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేననే సంకేతాలిచ్చారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒకవైపు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచి ఆశ్చర్యపరిచింది కూడా.
ఈ నేపథ్యంతో.. ఏప్రిల్ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాల్సి వచ్చేది. ఆపై ఆ వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల చిట్టా ఆ వెబ్సైట్లో ఉంది కూడా.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ వివరాలేవీ అప్డేట్ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడం లేకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు జస్టిస్ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
#BREAKING All Supreme Court Judges unanimously agree in a full court meeting to declare their assets to the Chief Justice of India.
The declaration of the Judges' assets will be uploaded on the Supreme Court's website.#SupremeCourt pic.twitter.com/XT9OvDaNmo— Live Law (@LiveLawIndia) April 3, 2025