
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2పైకేంద్రం అభిప్రాయం
పలు కీలక ప్రశ్నలు లేవనెత్తిన కేంద్ర గృహనిర్మాణ శాఖ
వాటిపై స్పష్టత వచ్చేవరకు ముందుకెళ్లకూడదని నిర్ణయం
రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ. రెండో దశ ప్రాజెక్ట్
డీపీఆర్ను కేంద్రానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో ప్రాజెక్ట్కు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి.
ముఖ్యంగా ఎల్ అండ్ టీ సంస్థ నెట్వర్క్పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవై) ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఎల్ అండ్ టీ నెట్వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతు న్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే మెట్రో ఫేజ్–2 డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) కేంద్రానికి సమర్పించింది. అయితే, పుణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డీపీఆర్లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
కేంద్రం లేవదీసిన కొన్ని ప్రశ్నలు..
» మొత్తం 76.4 కి.మీ. నిడివితో 5 కారిడార్లతో రూ.2,269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డీపీఆర్లో ప్రస్తావించారు. అయితే, ఎల్ అండ్ టీ నెట్వర్క్పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదు.
» 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్అండ్టీ నెట్ వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలి. ఇలాంటి సేవల వల్ల ఎల్ అండ్ టీకి పరోక్షంగా లాభం కలుగుతోంది. కానీ, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది.
» ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై మూడు కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ, డీపీఆర్లో దీనిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ అండ్ టీతో చర్చించిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.
» జూన్ 3వ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ పాల్గొన్నారు. ఖర్చు పంచుకోవడం, ఆపరేషనల్ అంశాలపై ఇంకా అంగీకారం లేదు. ఫేజ్–2 అమలయ్యాక ప్రభుత్వ సంస్థతో లాభాలు పంచుకోలేం అని ఆయన స్పష్టంగా తెలిపారు అని కేంద్రం పేర్కొంది.