సూచించిన సీజేఐ సూర్యకాంత్
బ్రిక్స్ చీఫ్ జస్టిస్ ఫోరమ్లో ప్రసంగం
న్యూఢిల్లీ: వాణిజ్య వివాదాల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్లాట్ఫామ్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దేశాల మధ్య సమన్వయంతో కూడిన ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో న్యాయవ్యవస్థది కీలకపాత్ర అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మొదలైన బ్రిక్స్ చీఫ్ జస్టిసెస్ ఫోరమ్లో వ్యాఖ్యానించారు.
బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఉన్నతస్థాయి నేతలు పాల్గొన్న ఈ ఫోరమ్లో జస్టిస్ సూర్యకాంత్ పలు న్యాయవేత్తల బృందాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండొనేసియా, యూఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ ప్రతినిధులు ఇందులో ఉన్నారు.
న్యాయ రంగంలో పరస్పర సహకారం, వాణిజ్య వివాదాల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ల ప్రాముఖ్యత, దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా జరిగే వాతావరణం కల్పించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచేందుకు సమర్థమైన వాణిజ్య న్యాయస్థానాల ఏర్పాటుపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే వృత్తినైపుణ్యాలను పెంచుకునేందుకు, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం ఎలా అన్నదానిపై కూడా ఆలోచనలు జరిపారు. ఈ సందర్భంగానే సీజేఐ వాణిజ్య వివాద పరిష్కారాలకు ఉమ్మడి ప్లాట్ఫామ్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.


