సీజేపీ కన్వినర్ అభిజీత్ దీప్కే ప్రశ్న
నాసిక్: మంచి స్కూళ్లను ఏర్పాటు చేయాలని, ఉన్న వాటిలో వసతులు మెరుగుపర్చాలని అడగడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అవుతుందా అని కాక్రోచ్ జనతా పార్టీ కన్వినర్ అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శించి, వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలని ఆయన సీఎం ఫడ్నవీస్ను కోరారు.
డిమాండ్ల సాధనకు నాసిక్లోని ఈద్గా మైదానంలో చేపట్టిన నిరసనలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా గిరిజన విద్యార్థులు పాలుపంచుకుంటుండగా నాసిక్కు చెందిన వివేక్ గావిట్, రాహుల్ పవారా, నందుర్బార్కు చెందిన లక్ష్మీ యాదవ్ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం ఆయన ఆందోళన చేస్తున్న గిరిజన విద్యార్థులను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు అందించే వసతులు, ఆహారం, విద్య నాణ్యత ఘోరంగా ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యాబోధన సరిగా లేదని, విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, టాయిలెట్లు కూడా లేవని దీప్కే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను, వసతులను ప్రైవేటుపరం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ముందుగా రాష్ట్ర సెక్రటేరియట్ను కూడా ప్రైవేటీకరించాలని వ్యాఖ్యానించారు. సీజేపీని కాంగ్రెస్ జితావో పారీ్టగా సీఎం ఫడ్నవీస్ పేర్కొనడంపై దీప్కే..‘మేం ఉగ్రవాదులకు లేదా కాంగ్రెస్కు బీ టీమ్ అవునో కాదో బీజేపీ నేతలు ముందుగా నిర్ణయించాలి.
స్కూళ్లలో వసతులు మెరుగుపర్చాలని కోరడం ప్రభుత్వ వ్యతిరేకమవుతుందా?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదు కాబట్టే, ప్రజలు ఆ పార్టీని అధికారంలో నుంచి దించేశారు. బీజేపీ గత 12 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఈ కాలంలో ఏం చేశారో చెప్పండి’అని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా నిరాహార దీక్షలో కూర్చుని ఓ విద్యారి్థని ఆస్పత్రికి తరలించారు.
దీంతో, అతడిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిపోయారు. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 592 మంది విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, వీరి మరణాలకు కారణమైన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


