బంగ్లాదేశ్ లో భూకంపం బీభత్సం సృష్టించింది. మధ్య బంగ్లాదేశ్ ప్రాంతాలలో పాటు ఆ దేశ రాజధాని ఢాకాలోని భూమి కంపించింది. దీంతో 10 మంది మృతి చెందడంతో పాటు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది.
శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ ని భూకంపాలు కుదిపేశాయి. సెంట్రల్ బంగ్లాదేశ్ ప్రాంతంతో పాటు రాజధాని ఢాకా నగరంలో పలు చోట్ల భూమి కంపించడంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో చిక్కుకొని దాదాపు 10 మంది వరకూ ప్రజలు మరణించారని అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ భూకంపంలో దాదాపు 14 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఢాకా జిల్లా యంత్రాంగం తెలిపింది. వాటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మరోసారి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఇప్పుడు వచ్చిన భూకంపం రాబోయే భారీ భూకంపానికి సూచికగా పరిగణించాలన్నారు. దాని కనుగుణంగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే శనివారం ఉదయం సైతం బంగ్లాలో స్పల్పంగా భూమి కంపించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం ప్రపంచంలో భుకంపం వచ్చే అవకాశాలు ఉన్న తొలి 20 నగరాలలో ఒకటి. అంతే కాకుండా అక్కడ జనసాంద్రత అధికంగా ఉండడంతో భవనాల నిర్మాణం సైతం అధికంగా ఉంటుంది. దీంతో ఢాకాలో శిథిలావస్థకు చెందిన కట్టడాలపై నిఘా ఉంచాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
గతంలో బంగ్లాదేశ్ భూభాగానికి పెద్దఎత్తున భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. 1869 నంచి 1930 మధ్య కాలంలో రిక్టర్ స్కేలుపై 7కు పైగా తీవ్రతతో ఐదు సార్లు భూకంపాలు వచ్చాయి.


