అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్).. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీజులు 2026 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నమోదైన ద్రవ్యోల్బణంను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది.
ఈ కొత్త మార్పులు ముఖ్యంగా ఉద్యోగ ఆధారిత, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులకు వర్తిస్తాయి. అమెరికాలో పని చేస్తున్న లేదా చదువుతున్న భారతీయులపై ఇవి గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
పెరిగిన ఫీజుల వివరాలు
➤ఫారమ్ I-129 (H-2B, R-1 వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.
➤ఫారమ్ I-129 (H-1B, L-1, O-1, P-1, TN వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.
➤ఫారమ్ I-140 (ఉపాధి ఆధారిత వర్గాలలోని విదేశీ కార్మికులు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.
➤ఫారమ్ I-539 (వలసేతర స్థితిని పొడిగించడానికి లేదా మార్చడానికి), F-1, F-2 విద్యార్థులు.. J-1, J-2 ఎక్స్ఛేంజ్ విజిటర్లు.. M-1, M-2 వృత్తిపర విద్యార్థులకు ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది.
➤ఫారమ్ I-765 (ఉద్యోగ అనుమతి - OPT, STEM-OPT) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.
పెరిగిన ఫీజుల ఆధారంగా వచ్చిన ఆదాయాన్ని.. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల మెరుగుదలకు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయడానికి, పెండింగ్ కేసుల తగ్గింపుకు, మొత్తం USCIS సేవల నాణ్యత పెంపుకు వినియోగిస్తామని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది.
భారతీయులపై ఎక్కువ ప్రభావం!
H-1B, L-1 వీసాల్లో భారతీయులు అత్యధికంగా ఉంటారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ పెండింగ్లలో కూడా ఇండియన్స్ వాటా ఎక్కువ. OPT, STEM-OPTలను ఉపయోగించే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఉద్యోగ మార్పులు, వీసా పొడిగింపులు, ప్రయాణ ప్రణాళికల కోసం ప్రీమియం ప్రాసెసింగ్పై ఆధారపడేవారు ఎక్కువ. కాబట్టి ఫీజులు పెరిగితే.. ఈ ప్రభావం భారతీయుల మీద ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!


