కోర్టు విచారణలో అర్జంట్‌గా బాత్రూమ్‌ వెళ్లాల్సి వస్తే ఎలా? | Another Court Proceedings From Toilet What Rules says If Any Urgency | Sakshi
Sakshi News home page

కోర్టు విచారణలో అర్జంట్‌గా బాత్రూమ్‌ వెళ్లాల్సి వస్తే ఎలా?

Jun 27 2025 4:12 PM | Updated on Jun 27 2025 4:41 PM

Another Court Proceedings From Toilet What Rules says If Any Urgency

న్యాయవ్యవస్థపై కనీస గౌరవం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ ఘటనపై చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏకంగా టాయిలెట్‌ సీటుపై నుంచే వర్చువల్‌ కోర్టు విచారణకు హాజరు కాగా, ఆ తతంగం అంతా రికార్డు అయ్యింది కూడా. అయితే కోర్టు విచారణలో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి అవసరం పడితే ఎలా మరి?

గుజరాత్ హైకోర్టు వీడియో విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని పాల్గొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జడ్జి నిర్జర్‌ దేశాయ్‌ ఓ చెక్‌బౌన్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ రద్దు కోసం వాదనలు వింటున్నారు. జూమ్‌ కాల్‌ విచారణ(Virtual Hearings) లో టాయిలెట్‌ సీటు నుంచి హాజరైన వ్యక్తి ఫిర్యాదుదారుడే. కానీ జూమ్‌కాల్‌లో పేరు ‘సమద్‌ బ్యాటరీ’ అని ఉంది. 

ఆ వ్యక్తి టాయిలెట్‌ సీటు మీద బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ పక్క అవతలి పార్టీ, మరోపక్క కోర్టులో లాయర్‌ వాదనలు వినిపిస్తున్నాడు. ఈలోపు.. ఆ వ్యక్తి ఫోన్‌ నేలపై ఉంచి శుభ్రం చేసుకున్నాడు కూడా. అటుపై మరో గదికి వచ్చి విచారణలో కొనసాగాడు. జూన్ 20వ తేదీ ఈ ఘటన జరిగింది. 

సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు అస్సలు ఉపేక్షించరు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే జరగ్గా.. కోర్టులు తీవ్రంగా పరిగణించాయి కూడా. ఈ ఏడాది మార్చిలో.. ఓ వ్యక్తి లావేటరీ నుంచి కోర్టువిచారణకు హాజరు కాగా.. ఆగ్రహించిన జడ్జి ఆ వ్యక్తికి ₹2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. అలాగే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెడ్‌పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి ₹25,000 జరిమానా విధించారు. 2020లో ఏకంగా ఓ అడ్వొకేట్‌ విచారణ టైంలో సిగరెట్‌ తాగుతూ న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు. 

అయితే కోర్టులకు హాజరైనప్పడు సరైన వస్త్రధారణ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా సవ్యంగా ఉండాలి.  కోర్టు హాల్‌లో విచారణ జరుగుతున్నప్పుడు గంభీరమైన వాతావరణం ఉంటుంది.  అలాంటి సందర్భాల్లో.. న్యాయమూర్తికి అసహనం కలిగించే పనులు చేయకూడదు. 

ఒకవేళ.. అత్యవసరం పడితే(ఒకటికి, రెంటికి) జడ్జిలకు విజ్ఞప్తి చేస్తే కచ్చితంగా అనుమతిస్తారు. ఒకవేళ సమయం గనుక లేనట్లయితే విచారణ త్వరగతిన పూర్తి చేయాలని లాయర్లకు సూచిస్తారు. వర్చువల్‌ హియరింగ్స్‌(వీడియో కాల్స్‌ విచారణలో)కు ఇదే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో.. మైక్‌ను మ్యూట్‌లో ఉంచడం, కెమెరాను ఆఫ్‌ చేయడం, లేదంటే తమ లాయర్ల ద్వారా జడ్జిలను రిక్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా గుజరాత్‌ హైకోర్టు ఉదంతంలో అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంగానీ, జరిమానా విధిచండంగానీ జరగలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement