
బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ముస్లింల ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్ను, వక్ఫ్ సవరణ బిల్లును గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కోల్కతాలో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ శకం 2026లో ముగుస్తుందని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచివేయడాన్ని మమతా బెనర్జీ భరించలేపోతున్నారని విమర్శించారు.
ఓటు బ్యాంక్ను కాపాడుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని ఆక్షేపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశి్చమబెంగాల్ వ్యక్తులు కూడా మరణించారని, అయినప్పటికీ మమతా బెనర్జీ నోరెత్తలేదని తప్పుపట్టారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లోని ముర్షీదాబాద్లో జరిగిన హింసాకాండ వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హస్త ఉందని అమిత్ షా ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. వసలదార్ల కోసం సరిహద్దులు తెరిచేశారని విమర్శించారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తుతోనే కాకుండా.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని అమిత్ షా స్పష్టంచేశారు.
బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో హింసను ఆశ్రయించకుండా డిపాజిట్లు అయినా తెచ్చుకోలగరా? అని మమతా బెనర్జీకి సవాలు విసిరారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఖండించింది. సరిహద్దుల రక్షణ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుందని గుర్తుచేసింది. బంగ్లాదేశ్ నుంచి వలసదార్లు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.