శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం | Allahabad High Court has dismissed a petition filed by the Hindu side plea | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం

Jul 4 2025 7:29 PM | Updated on Jul 4 2025 8:00 PM

Allahabad High Court has dismissed a petition filed by the Hindu side plea

లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న అభ్యర్థనను అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌) శుక్రవారం కొట్టేసింది. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి నేపథ్యంగా సాగుతున్న కేసులో భాగంగా.. ఈ పిటిషన్‌ సైతం దాఖలైంది.

షాహీ ఈద్గా అక్రమ కట్టడమని, కాబట్టి వివాదాస్పద స్థలంగా ప్రకటించాలని, ఈ కేసు విచారణ ముగిసే దాకా కోర్టు రికార్డుల్లో అలాగే ప్రస్తావించేలా కోర్టు సిబ్బందిని ఆదేశించాలని హిందూ సంఘాల తరఫున మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ వేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు లాయర్‌ ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో వివిధ హిందూ సంఘాలు కోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్‌లో శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో,కోర్టు పత్రాల్లో భవిష్యత్ విచారణలలో షాహీ ఈద్గా మసీదు అనే పదాన్ని ఉపయోగించకుండా, దాని స్థానంలో వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశించమని పేర్కొన్నారు. ఇదే పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement