నేరగాళ్లు జైలు నుంచి  పరిపాలించాలా?  | 'No one can give orders from jail' says PM Modi | Sakshi
Sakshi News home page

నేరగాళ్లు జైలు నుంచి  పరిపాలించాలా? 

Aug 22 2025 1:35 PM | Updated on Aug 23 2025 4:54 AM

'No one can give orders from jail' says PM Modi

ఊచలు లెక్కిస్తూ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలి  

చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే మీకు ఉలుకెందుకు?  

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం  

బిహార్, బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం.. 

గయాజీ:  అవినీతికి పాల్పడి జైలుపాలైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించడానికి చట్టం తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అధికారం వెలగబెడుతున్న వ్యక్తులు జైలుకెళ్లి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు చూసి మనం నిజంగా బాధపడాలని అన్నారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూ మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని చెప్పారు.

 అలాంటి వ్యక్తులు(ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) రాజ్యాంగ విలువలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లు జైలు నుంచే పరిపాలన చేస్తామంటే మనం చూస్తూ ఉండిపోవాలా? అని నిలదీశారు. 11 ఏళ్ల మా పాలనలో ఎలాంటి అవినీతి మరక లేదని గర్వంగా చెబుతున్నామని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, బిహార్‌లో ఆర్జేడీ అవినీతి బాగోతాలు ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. అందుకే అవినీతి ముఖ్యమంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచే తొలగించేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి సైతం వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. 

ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పుచేసి 50 గంటలు జైల్లో ఉంటే పోస్టు నుంచి తొలగిస్తారని, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు వదిలిపెట్టాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకొస్తున్న కఠినమైన చట్టాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, చేసిన పాపాలకు శిక్ష పడుతుందని భయపడుతున్నాయని విమర్శించారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే తప్ప పదవుల్లో కాదన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ముతో బొజ్జలు నింపుకున్నాయని నిప్పులు చెరిగారు.  

ప్రధాని మోదీ శుక్రవారం బిహార్, పశి్చమ బెంగాల్‌లో పర్యటించారు. బిహార్‌లోని గయాజీ జిల్లాలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో మూడు మెట్రో రైలు మార్గాలను ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130 సవరణ) బిల్లు– 2025తోపాటు బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పరోక్షంగా సమరి్థంచారు.  వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే...  

‘‘పహల్గాంలో మన పర్యాటకులను బలి తీసుకున్న ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని బిహార్‌ గడ్డపైనే ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చి చూపించా. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ ఉగ్రవాదుల భరతం పట్టాం.

ఓట్ల కోసమే విపక్షాల ఆరాటం: దేశంలో జనాభా స్వరూపం మారకుండా చూడాలన్న లక్ష్యంతో అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఉలుకెందుకు? మన దేశానికి వలసదార్లు, చొరబాటుదార్లు అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ సమస్య గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించా. కొన్ని రాష్ట్రాల్లో జనాభా స్వరూపమే మారిపోతోంది. స్థానికులు మైనారీ్టలుగా మారుతున్నారు. ఇది ఇకపై సాగడానికి వీల్లేదు. అందుకే డెమోగ్రఫీ మిషన్‌ ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. 

చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ  చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోంది. కేవలం అధికారం దాహంతో దేశ భద్రతను పణంగా పెడుతోంది. చొరబాటుదార్లను గుర్తించి, వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. వారు మన దేశంలో తిష్ట వేస్తామంటే ఒప్పుకోం. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీలు బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నాయి. అక్రమంగా వచ్చినవారంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలి’’. 
 

ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా ఒక్కటే రూల్ : మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement