
బీహార్ ఓటర్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రజల తరపున స్పందించడంలో ఘోరంగా విఫలమయ్యాయని కోర్టు అభిప్రాయపడింది.
బీహార్లో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడిన అంశంపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో.. ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను చేపట్టింది. ఇందులో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలుగానీ, ఫిర్యాదు గానీ చేయలేదు అని ఈసీ పేర్కొంది.
ఈ క్రమంలో పార్టీల నిష్క్రియతపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మీరు ఏమి చేస్తున్నారు?.. చోద్యం చూస్తున్నారా? అంటూ రాజకీయ పార్టీలను, ప్రత్యేకించి విపక్షాలను ప్రశ్నించింది. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలదేనని.. కానీ ప్రతిస్పందించడంలో వాళ్లు విఫలమయ్యారు వ్యాఖ్యానించింది.
బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) నియమించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు సహాయం చేయడంలో విఫలమయ్యాయి. అసలు రాజకీయ నాయకులు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు? అని నిలదీసింది. ఈ కేసులో 12 ప్రధాన రాజకీయ పార్టీలను ఇంప్లీడ్(పక్షాలుగా చేరుస్తూ) చేస్తూ.. పార్టీలు తమ కార్యకర్తలకు ఓటర్ల ఫిర్యాదులు నమోదు చేయడంలో సహాయం చేయాలని.. ECI సూచించిన 11 పత్రాలు లేదంటే ఆధార్ కార్డు ఆధారంగా ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బీహార్లో 65 లక్షల ఓటర్ల తొలగింపుపై ఈసీ అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు..
• ఆగస్టు 1న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల వివరాలు రాష్ట్రంలోని 38 జిల్లాల ఎన్నికల అధికారుల వెబ్సైట్లలో ప్రచురించాం
• మరణాలు, ఇతర ప్రాంతాలకు వలస, డూప్లికేట్ నమోదు కారణాలతో తొలగింపు ప్రక్రియ కొనసాగింది
•భౌతిక ప్రతులను పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించబడ్డాయి.
• ప్రచారం కోసం పత్రికలు, రేడియో, టీవీ, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేశాం.
• ఈ చర్యలు ఆగస్టు 14న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి

బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియలో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఎందుకు తొలగించారో.. ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ఓటర్ల విశ్వాసాన్ని పొందాలంటే పూర్తి పారదర్శకత అవసరం. తొలగించిన ఓటర్ల బూత్వారీగా జాబితా.. తొలగింపు కారణాలతో సహా.. జిల్లా స్థాయిలో పంచాయతీ కార్యాలయాల్లో అలాగే ఆధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అదే సమయంలో.. ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు అని కోర్టు గత ఆదేశాల్లో స్పష్టం చేసింది.