శ్రామిక్‌ రైళ్ల‌లో 97 మంది వ‌ల‌స కార్మికులు మృతి!

97 Migrants Died On Shramik Special Trains Says Railways - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన ‌లాక్‌డౌన్ స‌మ‌యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించేందుకు  కేంద్రం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వ‌ల‌స కార్మికుల వివ‌రాల‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రామిక్‌ స్పెషల్ రైళ్లలో సంభవించిన మొత్తం మరణాల వివరాలపై శుక్రవారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మొత్తం 97 మంది వలస కార్మికులు శ్రామిక్ రైళ్ల‌లో ప్రాణాలు కోల్పోయారని ఆయ‌న చెప్పారు. (గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు )

కాగా ఇటీవల వలస కార్మికుల మరణాల గురించి తమ వద్ద ఎలాంటి లెక్కలు లేవని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ప్రతిపక్షలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్ర తొలిసారిగా శ్రామిక్‌ రైళ్లలో సంభవించిన మరణాల లేక్కలను రాజ్యసభలో ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాల పోలీసులు వీటిని అసహజ మరణాలుగా పరిగణిస్తూ సెక్షన్ 174 కింద కేసులు నమోదు చేశార‌ని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం కేసుల్లో 87 కేసులకు సంబంధించి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన‌ట్లు వెల్లడించారు. అందులో 51 కేసుల్లో బాధితులు గుండె పోటు, లివర్, ఊపరితిత్తుల సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు లాంటి కార‌ణాల‌తో మరణించినట్టు తేలింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top