
ఏడు విమానాలు క్యాన్సిల్ కాగా వాటిల్లో ఆరు డ్రీమ్లైనర్ రకానివే
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి.
సాంకేతికలోపంతో..
ఢిల్లీ నుంచి పారిస్కు వెళ్లాల్సిన డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.
దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దు
అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.

ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్
శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.
అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది.