జమ్మూలో ఎన్‌కౌంటర్‌

3 terrorists killed encounter in Jammu Kashmir - Sakshi

ముగ్గురు ముష్కరులు హతం

నేలకొరిగిన కశ్మీర్‌ ఏఎస్సై

శ్రీనగర్‌: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్‌పీఎఫ్‌ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్‌ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు.

వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్‌ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్‌ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి.

పాంపోర్‌ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు.  ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్‌ బషీర్‌ ఖాన్‌దే, ఉమర్‌ తారిఖ్‌ భట్, జుబైర్‌ అహ్మద్‌ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్‌ జిల్లా ద్రంగ్‌బల్‌ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. 

ఎల్‌వోసీ వెంట పాక్‌ కాల్పులు
అసువులు బాసిన జేసీవో
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి  అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్‌ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్‌ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్‌ కాల్పుల్లో నాయిబ్‌ సుబేదార్‌ రజ్వీందర్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్‌ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top