సాక్షి, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వేరు వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభివించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరికొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఈ రోజు బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. వాటిలో అత్యధికంగా నైనిటాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.


