కందనూలు: డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కులో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జల సాధన సత్యాగ్రహ దీక్షకు రైతులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి, రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పాలమూరు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. నల్లగొండకు నీటి తరలింపు పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులు, గ్రామాలు నష్టపోయే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎర్రవల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపునకు గురిచేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. జల సాధన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ కోదండరాం ఫోన్లో సంఘీభావం తెలిపారు. పాలమూరు జిల్లా రైతాంగం నీటి హక్కుల కోసం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. రైతుల హక్కులు, పాలమూరు ప్రాంతానికి న్యాయం జరిగేలా విధాన మండలిలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శశిధర్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, సదానందం, జంగయ్య, చెన్నకిష్టయ్య, బెక్కెం జనార్దన్, తిమ్మప్ప, శ్రీనివాస్నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


