మహిళా సాధికారతకు పెద్దపీట..
దేశంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం
నారాయణపేట: పేదల సంక్షేమం, సమగ్ర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారదర్శక సుపరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాటికి శ్రీహరి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, శిక్షణ కలెక్టర్ ఫణికుమార్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణపేట, మక్తల్ గురుకుల, కస్తూర్బా విద్యార్థినులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్, టూరిజం పాలసీలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. భూ సేకరణలో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 3,112 మంది రైతులకు రూ.366.95 కోట్ల పరిహారం పంపిణీ చేశామని వివరించారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2026–27 వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 1,82,031 మంది రైతులకు రూ.259 కోట్ల రైతు భరోసా, రైతుబీమా కింద 618 కుటుంబాలకు రూ.30.90 కోట్లు చెల్లించామని, వానాకాలం సాగుకు 18,251.94 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు.
మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. జడ్ఎంఎస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ ద్వారా రూ.12.93 లక్షల లాభం ఆర్జించినట్లు చెప్పారు. నారాయణపేట, కోస్గి ఆర్టీసీ పరిధిలో 2.91 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా రూ.110.13 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, మిల్క్ పార్లర్ల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో
గణనీయమైన పురోగతి
రూ.4,725 కోట్లతో లక్ష ఎకరాలకు సాగునీటి ఎత్తిపోతల పథకం
మహిళా సాధికారతకు పెద్దపీట
రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


