కోస్గి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాఖాలో అధికారులు, నాయకులు కుమ్మకై ్క ఇంటి స్థలం లేని ఓ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. ఆ ఇంటిని ఓ రాజకీయ పార్టీ నాయకుడు పట్టణానికి దూరంగా వ్యవసాయ పొలంలో నిర్మించుకుంటున్న విషయాన్ని శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అధికారులా.. మజాకా’ శీర్షికన సమగ్ర వివరాలతో కథనం ప్రచురించడంతో జిల్లా అధికారులు స్పందించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని హౌజింగ్ పీడీ శంకర్ శుక్రవారం డీఈని ఆదేశించారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఏవైనా అక్రమాలు జరిగినట్లు రుజువైతే బాధ్యులైన అధికారులతో పాటు తప్పుచేసిన లబ్ధిదారులపై సైతం చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిన బిల్లులను సైతం రికవరీ చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. పుర అధికారులు సంబంధిత మహిళను అడిగి తన దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని సూచించారు. ఏం కావాలన్నా ఇంటి నిర్మాణం చేస్తున్న సదరు నాయకుడినే అడగాలని మహిళ అధికారులకు తేల్చి చెప్పారు. ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సమగ్ర విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


