నేడు స్వాతంత్య్ర వేడుకలు.. ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం
నారాయణపేట: జిల్లాకేంద్రంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుంచి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వరకు ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సాగేందుకు అన్ని సిద్ధం చేశారు. మరోవైపు భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరేడ్ మైదానం మొదలు జనం రద్దీగా ఉండే ప్రాంతాల వరకు ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ తనిఖీ..
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, వీఐపీలు, విద్యార్థులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అప్రమత్తమైన పోలీసులు..
వేడుకల నేపథ్యంలో భద్రత చర్యలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్, కలెక్టరేట్, కోర్టు ప్రాంగణం, ప్రధాన కూడళ్లు, జనం రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, సంచులు, వాహనాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లావ్యాప్తంగా బందోబస్తు, నిఘాను ముమ్మరం చేశారు.
పోలీస్ పరేడ్ మైదానంలో
అధికారులతో మాట్లాడుతున్న
కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
పరేడ్ మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక
బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు
రెండ్రోజులుగా కొనసాగుతున్న పోలీసు కవాతు రిహార్సల్స్
ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి..
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉదయం 9.30 గంటలకు మువ్వన్నెల జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 10.15 గంటలకు ముఖ్యఅతిథి సందేశం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత కార్యక్రమాలు కొనసాగనున్నాయి.


