మక్తల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. శనివారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కష్టపడాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను జీవిత లక్ష్యాలు సాధించేందుకు వినియోగించాలన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమయోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. వారి త్యాగాలను మరువొద్దని కోరారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని.. ముఖ్యంగా బాలికల కోసం పోక్సో, బాల్య వివాహల నియంత్రణ చట్టం ఉందన్నారు. ప్రాథమిక హక్కులు, విధులు అందరికి సమానంగా ఉంటాయని.. పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చని తెలిపారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు న్యాయమూర్తిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున్, సీనియర్ సూపరింటెండెంట్ హన్మంత్రావు, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరయ్య, న్యాయవాదులు దత్తాత్రేయ, ఆడెం శ్రీనివాసులు, తిమ్మన్న, సునీత, సతీష్కుమార్, సూర్యప్రకాష్, నరేందర్సాగర్, క్రాంతికుమార్, ఏఎస్ఐ శంకరయ్య, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.


