నారాయణపేట: ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలు, జీవితాలను త్యాగం చేయడంతోనే నేడు దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఎస్పీ డా. వినీత్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని.. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీస్శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని చట్టపరంగా తక్షణ సాయం అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలన్నారు. తెలంగాణ పోలీస్శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని విధుల్లో వినియోగించుకోవాలని సూచించారు.
పోలీసులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి విధులను బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, పోలీస్శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


