కోస్గి పీఠంపై ముగ్గురి గురి..
అధికారపార్టీలో
పదవుల పందేరం
మక్తల్ పీఠంపై ఇద్దరి గురి..
ఊట్కూర్ రేసులో ఐదుగురు..
నారాయణపేటలో నలుగురు..
● సామాజిక సమీకరణాలే కీలకం
● పీఏసీఎస్ పాలకవర్గాలకు
ఆశావహుల లాబీయింగ్
● తీలేరు పీఏసీఎస్పై డీసీసీ అధ్యక్షుడి ఆసక్తి!
నారాయణపేట: కాంగ్రెస్పార్టీలో నామినేటెడ్ పదవుల హీట్ పెరిగింది. తీలేరు పీఏసీఎస్ అధ్యక్ష పదవిని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి గతంలో రెండుసార్లు డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో.. అదే బాటలో పీఏసీఎస్ పదవి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆశీర్వాదం, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహకారంతో పీఏసీఎస్ పీఠం దక్కించుకొని డీసీసీబీ చైర్మన్ పదవిపై గురి పెట్టాలన్న వ్యూహంలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పీఏసీఎస్ పీఠాలపైనా..
పీఏసీఎస్ పాలకవర్గాలను తొలిసారి నామినేటెడ్ విధానంలో భర్తీ చేయనున్న నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులపై నేతలు కన్నేశారు. ఆశావహుల లాబీయింగ్ జోరందుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరిని బుజ్జగించాలి? అన్నది పార్టీ ముఖ్య నేతలకు సవాల్గా మారింది. కాంగ్రెస్పార్టీ జెండా మోస్తున్న సీనియర్లు, కొత్తగా ఎదుగుతున్న నాయకులు తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
నేతలకు అగ్నిపరీక్ష..
పీఏసీఎస్ పదవుల భర్తీ పార్టీ ముఖ్య నేతలకు అగ్నిపరీక్షగా మారనుంది. ఒకరికి పదవిస్తే మరోవర్గం అసంతృప్తికి గురయ్యే పరిస్థితులు ఉండటంతో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు మండలాల వారీగా ప్రాంతీయ సమతుల్యత పాటించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
పార్టీ మాజీ మండల అధ్యక్షులు సైతం..
అధికారంలో లేనప్పుడు మండలాల్లో పార్టీని నడిపించేందుకు కష్టపడి పనిచేశాం. ప్రస్తుతం పార్టీ మండల అధ్యక్షుల పదవి నుంచి తప్పించారు. పీఏసీఎస్ పదవులు ఇవ్వాలంటూ ఎవరి స్థాయిలో వారు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మండలస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేక యువత, కొత్త నాయకత్వానికి పట్టం కడతారా? అన్నది తేలాల్సి ఉంది.
మాగనూర్ నలుగురు..
మాగనూర్ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఆనంద్గౌడ్, వడ్వాట్ రవీందర్, దూళ్ల తిప్పయ్య, శివరాంరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ధన్వాడలోనూ పోటాపోటీ..
ధన్వాడ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి సుధాకర్రెడ్డి, రాఘవేంద్రారెడ్డి చిట్టెం, రాజేష్గౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నరహరి, బెలగొంది వీరన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దామరగిద్దలో నలుగురు..
దామరగిద్ద పీఏసీఎస్ అధ్యక్ష పదవికి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ ఈదప్ప, కానుకుర్తికి చెందిన సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
కోస్గి పీఏసీఎస్ అధ్యక్ష పదవికి ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ తూము భీంరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, అన్న కిష్టప్ప పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. భీంరెడ్డి మరోమారు పదవి ఆశిస్తుండగా.. విజయ్కుమార్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పీఏసీఎస్పై కన్నేశారు.
మద్దూర్ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి పేరు ఒక్కటే వినిపిస్తోంది.
మక్తల్ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి బీకేఆర్ ఫౌండేషనన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరికి సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వీరిద్దరూ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఊట్కూర్ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి పార్టీ మండల మాజీ అధ్యక్షుడు యగ్నేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యడు కృష్ణార్జునరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఎం.మానెమ్మ, ఎల్కోటి జనార్దన్రెడ్డి, పులిమామిడి మాజీ సర్పంచ్ పెద్ద సూరయ్యగౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
నర్వ పీఏసీఎస్ అధ్యక్ష పదవికి పెద్దకడ్మూర్ పోలీస్ జగన్మోహన్రెడ్డి పేరు ఒక్కటే వినిపిస్తోంది.
నారాయణపేటలో ప్రస్తుత పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ కో–ఆప్షన్ మహ్మద్ గౌస్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ సలీం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేరపళ్ల శంకర్ పేర్లు వినిపిస్తుండగా.. జాజాపూర్కు చెందిన డా. మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్ నుంచి సొంతగూటికి వస్తే ఆయనకు ఇచ్చే అవకాశం ఉందంటూ చర్చ కొనసాగుతోంది.


