మరికల్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలవాలని.. ఆ దిశగా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఉపాధ్యాయులకు మూడురోజుల పాటు ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై శిక్షణ ఎలా జరిగింది.. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారనే విషయాలను జిల్లా విద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని.. ఇప్పటి నుంచే అందరం కలిసి కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకునేలా బోధించాలని.. ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఆంగ్లం, గణితం ప్రాథమిక అంశాలు ఎంతో కీలకమన్నారు. డిజిటల్ పాఠాలు, ఆన్లైన్ బోధనతో త్వరగా అర్థం చేసుకొని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్నారు. రోజు ఒకేవిధంగా కాకుండా కొత్త ఆలోచనలు, వినూత్న బోధనా పద్ధతులు, బోధనా సామగ్రిని వినియోగించడంతో ఉపాధ్యాయులకు కూడా సంతృప్తి కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, తహసీల్దార్ రాంకోటి, ఎంఈఓ కరిమూల్లా, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తికావాలి..
నారాయణపేట ఎడ్యుకేషన్: మండలంలోని లింగంపల్లికి వెళ్లే దారిలో రూ.200 కోట్లతో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను శనివారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. 4 అకాడమిక్ బ్లాక్లు, ఒక సీనియర్ డార్మిటరీ, ఒక జూనియర్ డార్మిటరీ, వంటగది, భోజనశాల, ప్రధాన నివాస గృహం, రెండు సింగిల్ క్వార్టర్లు, ఆరు డబుల్ మరియు సంప్లు, తల్లిదండ్రుల లాంచ్లు ఉంటాయని టీజీఈడబ్ల్యూ ఐడీసీ మ్యాప్ ద్వారా కలెక్టర్కు వివరించారు. అగ్రిమెంట్ ప్రకారం 2027, జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.


