కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన ఓ వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇటిక్యాల నాగరాజుకు అనంతపురం జిల్లా సద్దలదిన్నెకు చెందిన వరలక్ష్మికి (38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. భర్త రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. వరలక్ష్మి క్రిమి సంహారక మందు తాగిందని తన బావమరిది దేవేంద్రకు ఫోన్ చేయడంతో తాడిపత్రికి తీసుకురావాలని సూచించాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఎలాంటి మందు తాగలేదని సమాధానం ఇచ్చాడు. తెల్లవారాక వరలక్ష్మి మృతి చెందిందని బావమరిదికి విషయం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, క్రిమిసంహారక మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ వెల్లడించారు.
మోటార్ల చోరీ :
నిందితుల అరెస్టు
పాములపాడు: వ్యవసాయ బావుల వద్ద విద్యు త్ మోటార్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణరావుపేట, కోల్స్ ఆనందాపురం గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు బాధిత రైతుల నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్కు చెందిన చంటి, నర్సమ్మ అనే ఇద్దరి నుంచి 5 మోటార్లు రికవరి చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ప్రమాదవశాత్తు
వలస కార్మికుడి మృతి
ఓర్వకల్లు: రేకుల షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నమడకల గ్రామ శివారులోని ఓ సిలికాన్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్నమడకల గ్రామ సమీపంలో కేఈ సోదరుల స్థలంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నూతన షెడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్కుమార్ (27) పైపులకు వెల్డింగ్ చేస్తుండగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు షెడ్కు నిర్మించిన ఇనుప పైపు ఊడి కిరణ్కుమార్పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ పాండురంగస్వామి తెలిపారు.


