కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్షిప్గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
తల్లిని కాపాడే ప్రయత్నంలో..
● తండ్రిపై కుమారుడి దాడి
● తీవ్ర గాయాలై తండ్రి మృతి
వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


