కర్నూలు(సెంట్రల్): నంద్యాలలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, జిల్లా నాయకులు టీజీ ప్రసాదు, నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అన్నారు. జర్నలిస్టుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారులు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై ఐ న్యూస్ చానెల్ చేసిన కథనంపై టీడీపీ నాయకులు, పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. మొదటగా కొందరు టీడీపీ నాయకులు వార్తా కథనాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాలని పోలీసుల ద్వారా రాయబారం నడిపారన్నారు. అయితే కథనాన్ని తొలగించే అధికారం తమ చేతిలో ఉండదని రిపోర్టర్లు చెప్పడంతో వారిపై డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఓ టీడీపీ నాయకుడితో ఫిర్యాదు తీసుకొని ముగ్గురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. అంతేగాక నంద్యాలలో ఉంటున్న ఇద్దరు రిపోర్టర్లను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యు లు భయపడేలా అరెస్టు చేశారని, మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను పూర్తిగా ఎత్తి వేయాలని కోరారు. జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


