నంద్యాల(అర్బన్): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపట్టి విద్యాసాగర్ తెలిపారు. పీఆర్సీ కమీషన్ ఏర్పాటు, నాలుగు డీఏల విడుదల, రావాల్సిన రాయితీలు, సరెండర్ లీవ్లు తదితర అంశాలపై విజయవాడలో శనివారం జరిగే ఏపీజేఏసీ కార్యవర్గ సమావేశంలో చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మినర్సారెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు స్థానిక ఎన్జీఓ హోం నుంచి జయంతి వెజ్వరల్డ్ వరకు వందలాది మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్జీఓస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం లక్ష్మినర్సారెడ్డి అసోసియేషన్కు చేసిన సేవలను కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు వెంగళరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, వేణుగోపాల్రెడ్డి, తదితరులు కొనియాడారు. కార్యక్రమంలో నంద్యాల జేఏసీ చైర్మన్ ఉసేన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, రాష్ట్ర సహ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, నంద్యాల తాలూకా మాజీ అధ్యక్షుడు మణిశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యాసాగర్ను సన్మానించిన
పెన్షనర్ల సంఘం
నంద్యాలకు వచ్చిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ను నంద్యాల పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రామసుబ్బయ్య, లింగస్వామిల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రాజగోపాల్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.


