● భార్యను హత్య చేసిన భర్త
● అనాథలుగా మారిన ఇద్దరు కుమార్తెలు
డోన్ టౌన్: తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డొస్తుందని భర్త అంతమొందించాడు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన డోన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అర్జున్రెడ్డి కాలనీలో నివాసముంటున్న ఇంతియాజ్ బాషా, సోంపురం గ్రామానికి చెందిన బలిజ ఈశ్వరి (35) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వరి దుస్తుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా ఇంతియాజ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో భార్య ఈశ్వరి తరచూ నిలదీస్తోంది. దీంతో కొంత కాలంగా వారి మధ్య కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున ఈశ్వరి తలపై ఇనుప రాడ్తో పలుమార్లు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అయితే నిందితుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జారి పడటంతో తలకు గాయాలయ్యాయని సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్య చేసినట్లు అనుమానించి మృతురాలి అక్క సాలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని, దర్యాప్తునకు సహకరించాలని పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


