
విపత్తు నిర్వహణ ప్రణాళికకు నివేదికలు ఇవ్వండి
గోస్పాడు: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కలిగే నష్టాలను నివారించడానికి వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక – నివారణ ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 54 గ్రామాల రహదారులకు అనుసంధానమై ఉన్న 21 వాగుల పటిష్టతకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ తదితర సాగునీటి కాలువలపై సరైన ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. వాగుల బండ్ పటిష్టతపై ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 80 ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలపై ఎప్పటికపుడు తనిఖీ చేసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 27,203 మట్టి ఇళ్లు ఉన్నాయని వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉంటుందని, అందులో ఎక్కువ శాతం బనగానపల్లెలో 6 వేల వరకు మట్టి ఇళ్లు ఉన్నాయని, అందులో ఉన్న వారికి అర్హత మేరకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి