రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 12,283 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వసంత్ తెలిపారు. శనివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో లోక్ అదాలత్ ముగిసిన అనంతరం ఆయన నల్లగొండలో మాట్లాడారు. కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచీల ద్వారా పలు విభాగాలకు చెందిన మొత్తం 12,283 పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరమయ్యాయని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా లభించే తీర్పునకు ఎలాంటి అప్పీలు ఉండదని, ఇరువర్గాలు సామరస్యంగా వివాదాలను ముగించుకోవచ్చని చెప్పారు. మొత్తం 12,283 కేసుల్లో క్రిమినల్ 2,813, సివిల్ 33, మోటార్ వాహన ప్రమాద బీమా 68, ట్రాఫిక్ చలాన్లు 9,281, బ్యాంకు రికవరీ 77, సైబర్ క్రైం 11 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సతీష్కుమార్, బి.అశోక్కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


