అత్యాధునిక వైద్య సౌకర్యాలు
కొత్త ఆస్పత్రిలో సేవలు బాగున్నాయి
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి సముదాయంలో సోమవారం నుంచి పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించగా, సోమవారం ఉదయం నుంచి వైద్యులు అధికారికంగా రోగులకు చికిత్స అందించడం ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచే ఓపీ విభాగం వద్ద రోగులు, వారి సహాయకుల సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొదటిరోజే దాదాపు 280 మంది రోగులు ఓపీ కోసం నమోదు చేసుకున్నారు.
ఈసీజీ సేవలు అందిస్తున్న వైద్యులు
డాక్టర్ వద్ద బారులుదీరిన మహిళలు
కొత్త భవనంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈసీజీ సేవలు ప్రారంభమవ్వగా, వారం రోజుల్లో డయాలసిస్ యూనిట్ కూడా అందుబాటులోకి రానుంది. పాత ఆసుపత్రిలోని సామాగ్రితో పాటు ఇన్పేషెంట్లను కూడా నూతన సముదాయంలోకి మార్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో వైద్య పరీక్షలు, మెరుగైన చికిత్స కోసం నకిరేకల్ ప్రాంత ప్రజలు నల్లగొండ లేదా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ నకిరేకల్ 100 పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభం
ఫ అన్ని సౌకర్యాలు ఉండడంతో ప్రజల హర్షం
నేను వైద్య పరీక్షల నిమిత్తం శాలిగౌరారం నుంచి వచ్చాను. కొత్త ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. విశాలంగా ఉండటంతో ఓపీ కోసం నిరీక్షంచుకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారి వివరాలు వెంటనే నమోదు చేసుకుని ఆయా విభాగాల డాక్టర్ల వద్దకు పంపిస్తున్నారు. డాక్టర్లు రాసిన మందులను కూడా ఆలస్యం లేకుండా ఇస్తున్నారు.
– పెంబళ్ల రేణుక, శాలిగౌరారం


