నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జి.శివమణి, బి.దత్తు, ఎన్.చరణ్ తేజ్ లను పంపించామని ఉమ్మడి జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతమైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి చేయూతనిచ్చి జాతీయస్థాయి క్రీడాకారులగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఏఎమ్మార్పీ కాల్వలో తవ్వకాలు
కనగల్ : మండల పరిధిలోని శాబ్దుల్లాపురం ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో కొందరు గుంతలు తవ్వుతున్నారు. తమ నీటి అవసరాలు తీర్చుకునేందుకు ప్రధాన కాలువలోకి జేసీబీలను పంపి తవ్వకాలు చేపట్టారు. ఒకవైపు ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రధాన కాలువకు లైనింగ్ వేస్తుండగా ఇక్కడ మాత్రం జేసీబీలతో ఐదు నుంచి పది అడుగుల మేర అక్రమ తవ్వకాలు జరపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువలో తవ్వకాలు చేపట్టడంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు సంబంధిత జేసీబీ ఓనర్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు.


