సాక్షి, యాదాద్రి: నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) కీలక సమావేశం సోమవారం భువనగిరిలోని వివేరా హోటల్లో జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి ప్రతి జిల్లా నుంచి 20 మంది పీఏసీ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
చర్చించే అంశాలివే..
ఉమ్మడి జిల్లాలో సర్వే ప్రక్రియ, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. ముఖ్యంగా నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను సమీక్షించడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఒకే వేదికపైకి వస్తుండటంతో ఈ పీఏసీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫ భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల సమావేశం
ఫ హాజరుకానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డి
జిల్లాల వారీగా పీఏసీ
సమావేశాల షెడ్యూల్ ఇలా..
ఉదయం 11 నుంచి 12 వరకు:
సూర్యాపేట జిల్లా
మధ్యాహ్నం 12 నుంచి 1:00 వరకు: యాదాద్రి భువనగిరి జిల్లా
మధ్యాహ్నం 1:00 నుంచి 2 వరకు :
నల్లగొండ జిల్లా


