ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
పెద్దవూర: యాగాలతో వర్షాలు కురిస్తే కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టడం ఎందుకని.. నెలకు రెండు యాగాలు చేస్తే సరిపోతుంది కదా అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పెద్దవూరలో నిర్వహించిన సీపీఎం నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ జలాశయంలో పేరుకుపోయిన పూడికను తీసివేస్తే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. నికర జలాలను ఎలా వాడుకోవాలో చూడాలని, యాగాలు కాదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండున్నర ఏళ్ల పాలనలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన జరిగే జైల్భరోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, ఎండీ.సలీం, కొండేటి శ్రీను, కె.ఆనంద్, మహేష్, వరలక్ష్మి, రాములు, దుబ్బ రామచంద్రయ్య, శ్రీను, కోటేష్, వెంకటయ్య, రవినాయక్, కృష్ణ, బషీర్, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, గురువయ్య, నాగార్జున, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


